గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అమ్మాయిలుఅబ్బాయిలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ విజయ్ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య కేసులో అతడి భార్య వనితపై కేసు నమోదైంది. విజయ్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వనితతోపాటు న్యాయవాది శ్రీనివాస్, శశిధర్లపై కూడా కేసు నమోదైంది.
ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ... విజయ్తో విడిపోయిన వనిత తన కుమారుడిని తరుచూ డబ్బు డిమాండ్ చేసేదని తెలిపారు. వనిత తరపు అడ్వకేట్ శ్రీనివాస్ పలుసార్లు ఈ విషయమై ఇంటికి వచ్చేవాడని తెలిపారు. పోలీసుల వద్ద ఉన్న సెల్ఫీ వీడియో ఆధారంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకునే ముందు విజయ్ ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడు ? ఎవరినైనా కలిశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విజయ్ తీసుకున్న సెల్ఫీ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వనిత, శశిధర్ మధ్య ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నామన్నారు. కాగా ఈ కేసులో మరిన్ని వివరాల కోసం రేపు పోస్ట్మార్టం నిర్వహించాలని నిర్ణయించారు. విజయ్ కు నటన అంటే ప్రాణం అని, అందుకే తాము ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చామని తెలిపారు.