సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన వారసులు రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రమేష్ బాబు నిర్మాణ రంగంలో ఉండగా..మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే కృష్ణ వారసురాలు మంజుల ఘట్టమనేని కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మనసుకు నచ్చింది'. అమైరా దస్తర్.. ఆమె స్నేహితుడు సందీప్ కిషన్ తో చేసే సంభాషణగా ఈ టీజర్ రూపొందింది.
ప్రీ-లుక్ టీజర్లో హీరో హీరోయిన్స్ కాళ్ళు తప్ప ఏమి చూపించకుండా కేవలం డైలాగ్స్ తో సరిపెట్టారు. కాని ఈ రోజు విడుదలైన టీజర్లో హీరోయిన్ “ప్రతీ మనిషిలో ప్రపంచమంత ప్రేమ ఉంటుందిరా.. కాని 0.1% కూడా బయటకి రావడంలేదు. ఒక్కసారి మన హార్టుతో మనం కనెక్ట్ అయితే ఆ ప్రేమంతా పరిచయమౌతుంది” అని హీరోతో చెప్పే డైలాగ్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
సందీప్ కిషన్, అమైరా దస్తర్, త్రిధా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లొకేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే అందంగా, రొమాంటిక్ గా ఇచ్చారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రథన్.
“విజువల్స్ ఎంజాయ్ చేయండి. వాటిని చిత్రీకరిస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసాను. ఇది మీకోసమే” అంటూ ట్వీట్ చేసారు మంజుల. కాగా, ఈ చిత్రాన్ని పబ్లిక్ డే సందర్భంగా జనవరి 26, 2018న విడుదల చేయబోతున్నారు.