‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళిని విమర్శించడానికి ఎవరు పెద్దగా సాహసించరు. అయితే ఈమధ్య పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తరుచు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్న కత్తి మహేష్ ఏకంగా రాజమౌళిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

 

ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే కొద్దిరోజుల క్రితం రాజమౌళి అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లకు సంబంధించిన కీలక కమిటీ సమావేశంలో కొన్ని సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అసెంబ్లీ భవన డిజైన్‌ పై రాజమౌళి ఒక సూచన చేశాడు. ఏపీలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన డిజైన్లలో ఎత్తైన టవర్‌ నుంచి అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్‌ ఫోస్టర్‌ డిజైన్‌ కు రాజమౌళి తన క్రియేటివిటి జోడిస్తూ అసెంబ్లీ సెంట్రల్‌ హాలులో తెలుగు తల్లి విగ్రహం పై సరిగ్గా ఉదయం 9.15 గంటలకు కిరణాలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించారు.


 అలా సూర్య కిరణాలు పడుతున్న తెలుగుతల్లి గ్రాఫిక్‌ వీడియోను రూపొందించిన రాజమౌళి దానిని విడుదల చేశాడు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి పాదాల పై సూర్య కిరణాలు పడే విధంగా తెలుగు తల్లి విగ్రహం పై సూర్య కిరణాలు పడేవిధంగా రాజమౌళి చేసిన సూచనలకు ప్రతి తెలుగువాడు తమ హర్షాన్ని తెలియచేస్తున్నాడు. అయితే కత్తి మహేష్ మాత్రం సోషల్ మీడియాలో ఈ విషయం పై విభిన్నంగా స్పందించాడు.


 “తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా’’ అని అంటూ కత్తి మహేష్ ప్రశ్నిస్తున్నాడు.  అయితే అతడు పెట్టిన పోస్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వాదనను సమర్ధిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న నేపధ్యంలో కత్తి మహేష్ ఇలా తెలుగు తల్లి పై ఆశ్చర్యకర కామెంట్స్ చేయడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: