తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పవన్ కళ్యాన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ టీజర్ కొద్ది సేపటి క్రితం వచ్చింది. పీఎస్పీకే 25 మూవీ ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, సాంగ్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. టీజర్ ఈరోజే అంటూ పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ ఒకరినొకరు చూస్తూ పరవశిస్తున్న పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.తాజాగా పవన్ భక్తుడు నితిన్.. ‘అజ్ఞాతవాసి’ టీజర్ కోసం ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేయగా.. కీర్తి సురేష్, అనుఇమ్మాన్యుయేల్ టీజర్ కోసం వెయిటింగ్ అంటూ తాజా పోస్టర్ను షేర్ చేశారు.
మొత్తానికి టీజర్ రిలీజ్ కావడం..అద్భుతమైన పాటతో మొదలైంది. ‘మధురాపురి సదనా...మృదు వధనా..మధు సూదనా..ఇల స్వాగతం’ అంటూ వస్తున్న పాట చూస్తుంటే ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాన్ ‘దేవ దేవం’ పాట గుర్తుకు వస్తుంది.
ఇక పవన్ చేస్తున్న ఫైట్స్, కామెడీ చూస్తుంటే సినిమా లో నవరసాలు మేళవించినట్లు కనిపిస్తుంది. సినిమాలో అందరు నటులు కవర్ అయ్యారు..ఒక్క ఖుష్బూ తప్ప. చివరిగా...‘వీడి చర్యలు ఊహాతీతం..వర్ణాతీం..దటీజ్ దా బ్యూటీ’ అంటూ టీజర్ ముగిసింది.
ఈ టీజర్ లో త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాన్ ని ఎలా చూపించాలో అన్ని అంశాలు ఈ టీజర్ లో చూపించినట్లు కనిపిస్తుంది. అప్పుడే టీజర్ చూసి ‘అజ్ఞాతవాసి’ సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఢంకా బజాయించి మరీ అంటున్నారు.