మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం కారు బోల్తా కొట్టి అందులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ (36) మృతి చెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సినిమా డెరైక్టర్ ముకళంజియం తన స్నేహితుని వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వచ్చి తిరుగు ప్రయాణంలో కొష్టాలు సెంటర్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు కుడివైపు ముందు చక్రం పేలిపోయింది. దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండో వైపు రోడ్డులో నాలుగు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు మద్దిపాడు ఎస్‌ఐకు సమాచారమందించడంతో కారులోని వారిని 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్‌పాండేకు తీవ్రగాయాలు కాగా, డెరైక్టర్ ముకళంజియం, నటుడు పెరుంజిత్తన్, డ్రైవర్ ఎస్.బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డెరైక్టర్ ముకళంజియం పూమణి, పూందొట్టం, కెలుక్కుమెరుక్కుం, మిటా మెరాస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మృతి చెందిన అరుణ్‌కుమార్ తంజావూరు జిల్లా పాపనాడుకు చెందినవారని తెలిసింది. ముకళంజియంది కూడా తంజావూరే. మద్దిపాడు ఎస్‌ఐ వి.మహేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: