వరస ఫ్లాప్ ల తరువాత గత సంవత్సరం ‘లౌక్యం’ ఇచ్చిన కిక్ తో మంచి జోష్ మీద ఉన్న గోపీచంద్ ఆనందం పై అతడు నటిస్తున్న ఒక లేటెస్ట్ మూవి టెన్షన్ పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయిన తరువాత రకరకాల కారణాలతో అదే హీరో నటిస్తూ ఆగిపోయిన సినిమాలు మళ్ళీ జీవం పోసుకుని తిరిగి సెట్స్ పైకి వచ్చి హడావిడి చేస్తుంటాయి.

ప్రస్తుతం ఇప్పుడు గోపిచంద్ ది అదే పరిస్ధితి అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఆగిపోయిన సినిమా షూటింగ్ ఈమధ్యనే తిరిగి ప్రారంభమయింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. గోపీచంద్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారని టాక్.

అయితే ఆర్ధిక కారణాలతో, స్క్రిప్ట్ సరిగ్గా లేదన్న నెపంతో ఇప్పటి వరకు ఆగిపోయిన ఈసినిమా ‘లౌక్యం' హిట్ అవటంతో తిరిగి జీవం పోసుకుని పట్టాలు ఎక్కింది. ఒకనాటి సూపర్ హిట్ దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ త్వరగా పూర్తి చేసి మార్చిలో విడుదల చేద్దామని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈసినిమాకు సరిగ్గా కథ కుదరక పోవడంతో పాటు చాలా కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న బి. గోపాల్ ఈ సినిమాను స్పీడ్ గా తీసినా ‘లౌక్యం’ తరువాత విడుదల కాబోతున్న సినిమాగా ఇది మారుతూ ఉండటంతో దర్శకుడు గోపాల్ తనకు ఎటువంటి రిజల్ట్ ఇస్తాడో అనే టెన్షన్ లో గోపీచంద్ ఉన్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: