అవకాశాలు ఎన్ని వచ్చినా టీవీ రంగాన్ని వదిలేది మాత్రం లేదని టీవీ, సినీ కళాకారుడు ప్రదీప్ అన్నారు. ‘భమ్ బోలేనాథ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తూర్పుగానుగూడెంలోని ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం రాత్రి జరిగిన ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌లో ఆయన పాల్గొన్నారు. దర్శకుడు కార్తీక్‌వర్మ చెప్పిన కథ కొత్తగా ఉందని, సరదాగా ఉందని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పారు. తనకు బ్రెడ్ అండ్ బటర్... టీవీ రంగమేనన్నారు.

ఇంతవరకూ చాల తక్కువ సినిమాలు చేశానన్నారు. 2015 తనకు స్పెషల్‌గా ఉందని, ఈ సంవత్సరంలోనే సొంత ప్రొడక్షన్‌పై ‘కొంచెం టచ్‌లో ఉంటే చెపుతాను’ టీవీ షో చేస్తున్నానని అన్నారు. స్టార్ హీరోలను కూడా ప్రొడక్షన్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇంతవరకూ సమంత, తమన్నా వచ్చారని, బన్నీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు.

వారు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడరని, ఆ అవకాశం ఇందులో ఉంటుంది కాబట్టి వారు కూడా ఇష్టపడుతున్నారని అన్నారు. ఈ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్నపాటి పాత్రలు చేసినా అవి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం కోసమేన న్నారు.

కాగా జనాన్ని ఆహ్లాదపరచడం కోసం ఎటువంటి పాత్రనైనా చేస్తానన్నారు. రాజమండ్రి రావడం ఇష్టంగా ఉందని, అమ్మ నాన్న ఇక్కడ నుంచి వచ్చారని అన్నారు. హైదరాబాద్‌లో సెటిలయ్యామని, వివాహం చేసుకోవాల్సిందిగా తనను తన తల్లి ఒత్తిడి చేస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: