మెగా ఫ్యామిలీతో సినిమాలు తీయడం అంటే కత్తి మీద సాములాంటిదే.. కారణం బలమైన కథా కధనంతో బారీ బడ్జెట్ తో మెగా కెరీర్ దృష్టిలో ఉంచుకొని తీయాల్సి ఉంటుంది. అంతే కాదు మెగా అభిమానులు తమ అభిమాన నటులపై ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. మరి అలాంటి ‘మెగా’ ఫ్యామిలీ హీరోతో చేయడం అనేది అదృష్టమే అనుకోవాలి. విషయానికి వస్తే... రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. డివివి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల 24 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో వైభవంగా ప్రారంభమైంది.

మెగాస్టార్ చిరంజీవి దంపతులు, దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేవుని ఫోటోలపై మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ క్లాప్ ఇవ్వడం జరిగింది. చిత్రం స్క్రీప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత దానయ్య డి.వి.వి.లకు అందజేశారు . దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. కథ చాలా బాగా వచ్చింది. రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో నా కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. మళ్ళీ మా కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందటం ఎంతో ఆనందాన్నిస్తోంది.

అంతే కాదు నిర్మాత దానయ్య డి.వి.వి. ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అని ఆనందం వ్యక్తం చేశారు. మరి చూడాలి ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధిస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: