రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య పోటీ
ఈ సమావేశానికి నాగబాబు, కాదంబరి కిరణ్, శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నాకు కుటిల రాజకీయాలు తెలియవని కేవలం మాతృమూర్తి లాంటి ‘మా’ అసోసియేషన్ కు సేవ చేయడానికి మనసు, సంకల్పం ఉంటే చాలునని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆస్తులు వెంట రావని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా హాస్యంతో సినీ కళామాతల్లికి సేవచేశానన్నారు. ఇదొక ధర్మ యుద్ధమని, ఈ ధర్మయుద్ధంలో మంచి చేయడానికి రావడమే పాపమా? అని రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పోటీపడే స్థాయి మరెవరికీ లేదని వ్యాఖ్యానించారు.
నాగబాబు,ఏడిద నాగేశ్వర్, శివాజీ రాజ సమావేశంలో మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్
తెలుగు వాడిగా పుట్టిన దౌర్భాగ్యం వల్లే.. అంతర్జాతీయ సినిమా చేసినా గుర్తింపు రాలేదని రాజేంద్రప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను నవ్వు అనే అస్త్రంతో ఏ ముఖ్యమంత్రిని అయినా ఆకట్టుకుంటానని ఆయన చెప్పారు.రాజకీయం చేసే ఖర్మ తనకు లేదని అన్నారు.పోటీ అంటూ దిగాక వెన్ను చూపే ప్రసక్తి లేదని అన్నారు.రెండు పానల్ లో ఉన్నవారంతా తన వారేనని ఆయన అన్నారు.మార్పు కోసం,మంచి కోసం , ఆ నలుగురికి ఉపయోగం కోసం తనను గెలిపించాలని రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.తాను ఎవరిని బెదిరించలేదని, తననే బెదిరించారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.అయితే తాను అందరికి స్నేహితుడనని అన్నారు. మంచు విష్ణు తనకు మద్దతు ఇచ్చారని అన్నారు.