అక్కినేని కుటుంబ సినిమాగా విడుదలై విజయం సాధించిన ప్రేరణతో దివంగత ప్రముఖ నిర్మాత రామానాయుడు తన కుటుంబంలోని హీరోలందరితో ఒక  కుటుంబ సినిమాను తీయాలని చాల ప్రయత్నించారు.  అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన కన్ను మూసారు. ఇప్పుడు రామానాయుడు కన్న  కలలను తీర్చడానికి ఆయన పెద్దకుమారుడు సురేష్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈమధ్య కాలంలోనే రామానాయుడు చనిపోయిన తరువాత షాక్ కు గురైన ఆయన కుటుంబ సభ్యులు ఆ షాక్ నుండి తేరుకుని వారి వ్యాపార కార్యక్రమాలలో తిరిగి బిజీగా మారుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అల్లుఅర్జున్  ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదల వాయిదా పడటంతో సురేష్  సంస్థ నిర్మించిన ‘అవును 2’  సినిమాను వచ్చేనెల 3న విడుదల చేస్తున్నారు. 

ఈ వార్తలు ఇలా ఉండగా నిర్మాత సురేష్ బాబు తన తమ్ముడు వెంకటేష్,  కొడుకు రానా మేనల్లుడు నాగచైతన్య లతో  కలిపి ఇదే సంవత్సరం ఒక  మల్టీ స్టారర్ ప్రారంభించడానికి సంబంధించి ఏర్పాట్లను చురుకుగా చేస్తున్నట్లు టాక్. దీనికి సంబంధించి ఒక మంచి కథను ఎంపిక చేసే బాధ్యతను తన తమ్ముడు వెంకటేష్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ తనకు తెలిసిన రచయితలు అందర్నీ పిలిపించుకుని ఈ దగ్గుబాటి వారి కుటుంబ కథా చిత్రానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టినట్లు ఫిలింనగర్ టాక్. త్వరలోనే మరో మనం రాబోతోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: