పని రాక్షసుడిగా పేరు పొందిన రాజమౌళి తన దగ్గర పనిచేసే సాంకేతిక నిపుణుల నుండి నటీనటుల వరకు విపరీతంగా తన క్రియేటివిటీతో హింస పెడతాడు అనే మాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే అటువంటి రాజమౌళిని ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాకు పనిచేస్తున్న గ్రాఫిక్ టీమ్ టార్చర్ కు గురి చేస్తోంది అనే వార్తలు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. 

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాజమౌళి గత కొద్ది రోజులుగా ముభావంగా ఉండటానికి గల కారణం ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ క్వాలిటీ అతడి అంచనాలకు తగ్గట్లుగా ప్రస్తుతం ఈ పని చేస్తున్న గ్రాఫిక్ టీమ్ చేయలేక పోతోంది అనే మాటలు ఉన్నాయి. అంతేకాదు రాజమౌళి ఊహలకు తగ్గట్టుగా గ్రాఫిక్ డిజైనింగ్ లో కూడా ప్రస్తుతం రాజమౌళి దగ్గర ఉన్న టీమ్ జక్కన్న అంచనాలను అందుకోలేక పోవడంతో జరుగుతున్న పరిణామాలతో రాజమౌళి తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్. 

రోజుకు రెండు షిప్టుల చప్పున వందలాది మంది గ్రాఫిక్ టీమ్ ‘బాహుబలి’ సినిమా పై పనిచేస్తున్నా రాజమౌళి అంచనాలకు తగ్గట్టుగా పని వేగవంతం కాకపోవడమే కాకుండా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో కూడా ఈ గ్రాఫిక్ టీమ్ రాజమౌళిని సంతృప్తి పరచ లేకపోతోంది అనే మాటలు వినిపిస్తున్నాయి. 

దీనితో అన్ని పనులు మానుకుని రాజమౌళి గ్రాఫిక్ టీమ్ తో రాత్రి పగళ్ళు కుస్తీ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో రజినీకాంత్ సినిమా ‘కొచ్చాడియన్’ గ్రాఫిక్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఆ సినిమా విజయం పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం తెలిసిందే. ఈ విషయాలు గుర్తుకువచ్చి కాబోలు ప్రస్తుతం రాజమౌళి చాల టెన్షన్ లో ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి..






మరింత సమాచారం తెలుసుకోండి: