ఈమధ్యనే విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంకటేష్ తాను నటించబోయే సినిమాల పై మనసు పెట్టి రకరకాల కథలను వింటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో రీమేక్ సినిమాలకు చిరునామాగా ఉండే వెంకటేష్ మనసు ఇప్పుడు బాలీవుడ్ హిట్ మూవీ ‘పీకూ’ పై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ విషయాన్ని గ్రహించిన ఒక టాలీవుడ్ అగ్ర నిర్మాత ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి వెంకటేష్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. అమితాబ్ - ఇర్ఫాన్ - దీపికా   తమ ఇమేజ్‌ లకు భిన్నంగా నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అoదుకోవడమే కాకుండా ఆర్ధికంగా కూడ మంచి విజయాన్ని సాధించింది.

ఈ సినిమా పై ఇప్పటికే మనసు పడ్డ వెంకటేష్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే జనం చూస్తారా? అన్న ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమా టాలీవుడ్ లో రీమేక్ చేస్తే వెంకటేష్ అమితాబ్ రోల్ చేస్తాడా? లేదంటే ఇర్ఫాన్ రోల్ చేస్తాడా? అన్న విషయం పై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. 

అయితే దీపికా రోల్‌కు సమంత‌ను ఒప్పించి చేయించడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వెంకటేష్ అమితాబ్ పాత్రను చేయడానికి సాహసించకపోతే ఆ పాత్రను ప్రకాష్ రాజ్ చేత నటింప చేయడానికి ప్రయత్నిస్తారు అని ఫిలింనగర్ టాక్. ఈ వార్తలే నిజం అయితే త్వరలో టాలీవుడ్ లో మరో మంచి సినిమా రాబోతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: