బాహుబలి.. భారతీయ సినీచరిత్రలో సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమవుతోంది. దాదాపు 250 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం దాదాపు 4 వేల పైచిలుకు ధియేటర్లలో రిలీజవుతోందని వార్తలు వస్తున్నాయి. దాదాపు మొదటి వారంలోనే పెట్టుబడి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఐతే.. ఈ చిత్రాన్ని పైరసీ భయం వణికిస్తోంది. విడుదలైన కొన్నిగంటల్లోనే పైరసీ, ఇంటర్నెట్ లలో ప్రింట్ వచ్చేస్తున్న నేపథ్యంలో బాహుబలి నిర్మాతలు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. పైరసీరాయుళ్లపై ఉక్కపాదం మోపేందుకు ముందస్తుగా కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా ఈ చిత్రానికి ఎలాంటి పైరసీని చేపట్టరాదంటూ న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది.
బాహుబలి డౌన్ లోడ్ చేసుకుంటే జైలే..
చిత్ర నిర్మాత శోభనాద్రి యార్లగడ్డ...ఆర్కా మీడియా వర్క్స్ లిమిటెడ్ తరఫున సిటీ సివిల్ కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, పైరసీ జరిగితే ఎంతో నష్టం వాటిల్లుతుందని పిటీషన్లో పేర్కొన్నారు. టెలికాం, ఇంటర్నెట్ ప్రొవైడర్లతో పాటు గుర్తు తెలియని వ్యక్తలను కూడా ఈ కేసులో
ప్రతివాదులుగా చేర్చారు.
దీన్నిబట్టి ఎవరైనా పైరసీ చేసినట్టు తెలిసినా.. కనీసం నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిసినా సరే..వారిని ఈ కేసు కింద అరెస్టు చేస్తారన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న వారిపైన కూడా కోర్టు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పైరసీ ప్రింట్ వచ్చింది కదా, చూస్తే ఏమవుతుందిలే అని ఎవరైనా కక్కుర్తి పడితే ఇక అంతే సంగతులు.. అందుకే కాస్త జాగ్రత్త.. ఐనా.. ఇలాంటి విజువల్ ఫీస్ట్ ను ధియేటర్లో చూస్తే కానీ అసలు మజా రాదు కదా..