ఇప్పటి వరకు తన పెళ్ళి ఎప్పుడో తెలియని అనుష్కకు సంబంధించిన ఒక న్యూస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అనుష్క మనవడి కోసం వెతకటం ప్రారంభం అయింది అని తెలుస్తోంది. గుణశేఖర్ 70 కోట్ల ఖర్చుతో దాదాపు 40 మంది పేరున్న టాలీవుడ్ నటీనటులతో భారీగా నిర్మించిన ‘రుద్రమదేవి’ ఇంకా విడుదల కాకుండానే ఈసినిమా సీక్వెల్ స్క్రిప్ట్ ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

రాజమౌళి ‘బాహుబలి’ ని అనుసరిస్తూ గుణశేఖర్ కూడ ‘రుద్రమదేవి’ కి సీక్వెల్ తీయడానికి సిద్ద పడుతున్నట్లు ఫిలింనగర్ టాక్. ‘రుద్రమదేవి’ పరిపాలన అనంతరం ఆమె మనవడు ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యానికి తిరుగు లేని చక్రవర్తిగా ఒక వెలుగు వెలిగాడు. అతడి హయంలో ఓరుగల్లు కోటను స్వాధీనం చేసుకోవడానికి ఏడు సార్లు దండెత్తిన ఢిల్లీ సుల్తానులతో పోరాటం చేసి తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పిన చక్రవర్తి ఇతడు.

తమిళనాడులోని మధురై కేరళలోని కొన్ని ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల ప్రాంతాలను కలిపి మహాసామ్రాజ్యంగా మార్చి ఏలిన రుద్రమదేవి కూతురు కొడుకు అయిన ప్రతాపరుద్రుడి జీవితాన్ని అదే పేరుతో గుణశేఖర్ సినిమాగా తీయబోతున్నాడు. ఈసినిమాలో ‘రుద్రమదేవి’ సినిమాలోని కొన్ని పాత్రలు సన్నివేశాలు కూడ కలిసి ఉండటంతో ఈసినిమా ‘రుద్రమదేవి’ కి సీక్వెల్ గా మారుతుంది అని అంటున్నారు. 

అయితే ఈ ప్రతాపరుద్రుడి పాత్ర కోసం రామ్ చరణ్ ను కాని జూనియర్ ను కాని ఒప్పించాలని గుణశేఖర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఈ పాత్రను బాలకృష్ణ చేత చేయించి బాలయ్య 100వ సినిమాగా మార్చాలని గుణశేఖర్ మరో ఆలోచన కూడ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు అన్నీ ‘రుద్రమదేవి’ రిజల్ట్ బట్టి ఆధారపడి ఉంటాయి. సెప్టెంబర్ 4న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం వచ్చిన తరువాత ఈ సీక్వెల్ పై ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: