నేటితో 44వ వసంతాలు పూర్తి చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన అభిమానులకు అందుబాటులో లేకపోయినా పవన్ పుట్టినరోజు వేడుకలు మాత్రం అత్యంత ఘనంగా అర్దరాత్రి నుంచి మన ఇరు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుని అందరికీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు పవన్ తాను వ్యక్తిగతంగా  ఎటువంటి సెలబ్రేషన్స్ జరుపుకోవడం లేదు. 

అయితే పవన్ వీరాభిమానులు మాత్రం పవన్ పుట్టిన రోజును అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి బాణాసంచా కాలుస్తూ పవన్ పుట్టినరోజు సంబరాలకు స్వాగతం పలికారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలలోని పలు చోట్ల పవన్ అభిమాన సంఘాలు అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా  పవన్ అభిమానులు ‘ప్లాoట్ ఎ ట్రీ’ కార్యక్రమాన్ని చాల భారీ ఎత్తున ఈరోజున చేబడుతున్నారు. ఈ రోజు కాకినాడలో పవన్ అభిమానులు 550 కేజీల భారీ కేకు ను కట్ చేసి సంబరాలు జరుపుకొ బోతున్నారు.

ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, మొక్క నాటే సెల్పీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పవన్ అభిమానులు పిలుపును ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మొక్కలు పెంచడం, సేంద్రీయ వ్యవసాయం పట్ల ఉన్న మక్కువతో పవన్ అభిమానులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే పవన్ మాత్రం తన అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు పేరుతో ఆర్భాటాలు ఏమీ చేయవద్దని, వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేపట్టమని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ వెబ్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా యంగ్ హీరో నిఖిల్ కోన వెంకట్ తో కలిసి పవన్ పుట్టినరోజును విభిన్నంగా సెలిబ్రేట్ చేస్తున్నాడు. పవన్ పై ఒక ప్రత్యేకమైన పాటను రాయించడమే కాకుండా ఆ పాటకు పవన్ కళ్యాణ్ పర్సనల్ స్టిల్స్ విజువల్స్ గా జోడించి పాట చివరిన శంకరాభరణం టీమ్ అంటూ పవన్ కు అభినందనలు తెలపడంలో ముందు వరసలో ఉండటంతో ఈసారి నితిన్ పాత్ర నిఖిల్ పోషిస్తున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. పవన్  కళ్యాణ్ అందుబాటులో లేకపోయినా పవన్ నామస్మరణతో టాలీవుడ్ హోరెత్తి పోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: