ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లి ఓ తెలుగు యువకుడు అమెరికాలో మృతి చెందాడు. తమ పిల్లల భవిష్యత్ బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తూ.. తమ పిల్లలు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యలు అభ్యసించి మంచి స్థాయికి రావాలని అనుకుంటారు.  కానీ ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన తమ పిల్లలు అక్కడ దుర్మరణం చేందారని తెలిస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదన మాటల్లో చెప్పలేం. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రవీణ్‌ గల్లా(23) మృతి చెందారు.

న్యూ పోర్టు బీచ్‌ దగ్గర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తిరుపతికి చెందిన గల్లా నాగేశ్వర్ రావు కొడుకు ప్రవీణ్ గల్లా కాలిఫోర్నియాలోని ఫుల్లెర్టన్‌లో ఎమ్మెస్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఫిబ్రవరి 1‌వ తేదీ నుంచి అతను కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అక్కడ పోలీసులు గాలిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.  పదిరోజుల అనంతరం బుధవారం ఓ బీచ్ దగ్గర అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ చాలా రోజులుగా డిప్రెషన్ లో ఉన్నట్టు అక్కడి పోలీసులు తెలిపారు. విద్యాపరమైన అంశాలా..? లేక వేరే కారణాల వల్ల చనిపోయాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ప్రవీణ్ మరణించాడని తెలుసుకున్న అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: