తెలుగు వారి పండుగలు, సంస్కృతి కి అద్దం పట్టేలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఈ సంవత్సరం వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభించారు. డాలస్ కన్వెన్సన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ సంబరాలు జరగనున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న ప్రముఖులు, రాజకీయవేత్తలు, వివిధ వర్గాలకు చెందిన అతిధులు సందడి చేయబోతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా నోరురించే తెలుగు వంటకాలతో కమ్మని భోజనాలు ఆహుతుల కోసం సిద్ధంగా ఉంచారు.
బంధుమిత్రులతో పెద్ద ఎత్తున తెలుగు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. నాటా మహాసభల్లో ఈసారి పత్రికా-మీడియాపై సదస్సును ఏర్పాటు చేశారు. సాహిత్య సమావేశాలకు సైతం ప్రాధాన్యం కల్పించారు. నాటా సదస్సులో భాగంగా నిర్వహిస్తున్న బిజినెస్ సెమినార్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం 12 వేలమంది సభ్యులతో నాటా దూసుకెళుతోందని ప్రకటించారు.
నాటా కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోనే కాక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని నాటా అధ్యక్షుడు మోహన్ మల్లం తెలిపారు. బాంక్వెట్ కార్యక్రమంలోనే పలువురు ప్రముఖులకు నాటా అవార్డులను అందజేశారు. రిచర్డ్సన్ నగర మేయర్ పాల్వాకర్ కార్యక్రమానికి వచ్చి నాటా చేస్తున్న సేవను అభినందించారు.