సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక సెరంగూన్ పెరుమాళ్ ఆలయంలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. ముంబయి నుంచి తెప్పించిన వినాయక విగ్రహాన్ని పాలవెల్లితో అందంగా అలంకరించి పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన కొన్ని పద్యాలు పాడి వినిపించారు. పురాణాలు, వినాయకోత్పత్తి కథ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు.
దాదాపు రెండు గంటలపాటు ఆయన చమత్కరిస్తూ చెప్పిన ప్రవచనం అందరినీ ఆకట్టుకుందని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు రవికుమార్ అన్నారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకిరించిన విజ్జెంద్ర, రాజశేఖర్, సుధాకర్, సత్యచీర్ల, సత్యసూరిశెట్టి, చల్లా శ్రీధర్, రామరాజు, నగేశ్, పవన్, అనిల్, కిశోర్, ప్రదీప్, జ్యోతీస్వరరెడ్డి, రాంబాబు, శ్రీవిద్య, మమత, విజయకుమార్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విరాళాలు అందించిన దాతలను గౌరవ కార్యదర్శి వేణుమాధవ్ అభినందించారు.