సింగపూర్ తెలుగు సమాజం సెప్టెంబర్ 10న మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘నారి-2016’ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2015లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఎంతో విజయాన్ని సాధించిందని తెలుగు సమాజం అధ్యక్షులు రంగా రవికుమార్ తెలిపారు. స్థానిక మ్యాక్స్ అట్రియా సింగపూర్ ఎక్స్పోలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శ్రీమతి శైలజాకిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు మాతృభూమిపై ప్రేమను, సంస్కృతి, సామాజిక బాధ్యత, నైతిక విలువలను బోధించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. గాయని గీతామాధురి, వ్యాఖ్యత శ్రీముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళ సభ్యులు రేణుక, శ్రీవిద్య, మమత ఆధ్వర్యంలో అందాల పోటీలను నిర్వహించారు. పోటీల విభాగంలో యామిని, విశాలాక్షి, క్రాంతి, సౌమ్య, జాహ్నవి, లక్ష్మిప్రసన్నలు విజేతలుగా నిలిచారు. మరో విభాగంలో రాజ్యలక్ష్మి, శారద, గాయత్రి, కల్యాణి ధర్మారావు గెలిచారు. మీడియా పార్టనర్స్ ఈటీవీ, టీవీ-9లకు అధ్యక్షులు రంగా రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
అతిథులకు ఉపాధ్యక్షులు సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. గౌరవ కార్యదర్శి వేణు మాధవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులు రేణుక, శ్రీవిద్య, మమత, విజేంద్ర, రాజశేఖర్, రత్నాకర్, సత్య సూరిశెట్టి, చల్లా శ్రీప్రదాయ, శ్రీధర్, రామరాజు, నగేష్, పవన్, యుగంధర్, జ్యోతీశ్వరరెడ్డి, ప్రదీప్, పంచ్ పద్మ, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. యువ కార్యవర్గ సభ్యులైన భావన, కీర్తనలు సాంకేతిక సహాయం అందించినందుకు కార్యవర్గ సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.