అమెరికాలో దారుణ హత్యకు గురైన తల్లి, తనయుడి ఉదంతం ప‌లు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమార్తె, మనవడిని అల్లుడే హత్య చేసి కట్టుకథలు అల్లుతున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నగర శివారులోని తాడిగడప లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న శశికళ తల్లిదండ్రులు.. హత్య సమాచారం తెలిసిన వెంటనే కుప్పకూలిపోయారు. `బంగారపు తునకను దుర్మార్గుడి చేతిలో పెట్టాం` అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శుక్ర‌వారం మీడియాతో మాట్ల్ల్టాడుతూ అల్లుడే ఈ హత్య చేశారని, రెండేళ్ల నుంచి అతని ప్రవర్తన సరిగా లేదని శశికళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని, తనను సరిగా చూడడం లేదంటూ తమ కుమార్తె పలుమార్లు త‌మ వ‌ద్ద విల‌పించింద‌ని అన్నారు. అల్లుడి కుటుంబ సభ్యులకూ ఈ విషయం తెలిసినా కుటుంబాన్ని చక్కదిద్దేందుకు ఎంతమాత్రం ప్రయత్నించలేదని విలపించారు.



న్యూజెర్సీలోని మ్యాపుల్‌సెట్‌లో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు భార్య నర్రా శశికళ, అతని ఏడేళ్ల కుమారుడు అనీష్‌ సాయి హత్యకు గురైన సంగ‌తి తెలిసిందే. హనుమంతరావుకు 2004 నవంబర్ లో కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన సుంకర వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి  కుమార్తె  శశికళతో విజయవాడలో వివాహమైంది. తొమ్మిదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. శశికళ కాగ్నిజెంట్‌ కంపెనీకి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం శశికళ బాబును స్కూల్‌ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు  ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన హ‌నుమంత‌రావు త‌న భార్య, కుమారుడు విగతజీవులుగా పడివున్నారని త‌న‌ కుటుంబ  సభ్యులకు సమాచారం ఇచ్చారు. దుండగులు ఎవ‌రో వారిని గొంతు కోసి హత్య చేశారని చెప్పారు.  ఈ ఉదయం శశికళ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన హనుమంతరావు త‌న భార్య, కుమారుడు చనిపోయారనే ఒక్క మాటతో ఫోన్‌ పెట్టేశారని, అంతకు మించి మరే విషయం త‌మకు చెప్పలేదని మృతురాలి తల్లిదండ్రులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: