హెచ్-1బి ఆంక్షలపై భారత్ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే అమెరికా టిసిఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలపై విమర్శలు గుప్పించింది. వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులు చేయడం ద్వారా ఈ కంపెనీలు గత ఏడాది లాటరీలో ఎక్కువ హెచ్-1బి వీసాలు సంపాదించాయని ఆరోపించింది. ఈ వీసాలపై అత్యున్న నైపుణ్యాలున్న ఐటి నిపుణులను అమెరికా పంపించాల్సి ఉంటే ఈ కంపెనీలు మాత్రం తక్కువ జీతాలకు పనిచేసే కనీస నైపుణ్యాలున్న ప్రారంభ స్థాయి నిపుణులను అమెరికా పంపిస్తున్నాయని వైట్హౌస్ పేర్కొంది.
ఇలా పంపించే వారిలో 95 శాతం మంది వార్షిక జీతం 60,000-65,000 డాలర్లు మాత్రమేనని తెలిపింది. టెక్ దిగ్గజాలకు పేర్కొందిన సిలికాన్ వ్యాలీలో పని చేసే ఐటి నిపుణుల 1.5 లక్షల డాలర్ల వార్షిక జీతంతో పోలిస్తే ఇది చాలా తక్కువని పేర్కొంది. అధిక జీతాలు ఉండే స్థానిక అమెరికన్లను కాదని తక్కువ జీతాలతో భారతీయులను నియమించుకునేందుకే ఈ కంపెనీలు హెచ్-1బి వీసాలను ఇలా దుర్వినియోగం చేస్తున్నట్టు వైట్హౌస్ అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్ ఇంకా స్పందించలేదు.