సందర్శన వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాలనుకునేవారు జులై 1వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆస్ట్రేలియన్ హైకమిషన్ వెల్లడించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన పోర్టల్ ఖాతా ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చని హైకమిషనర్ క్రిస్ ఎల్సాఫ్ట్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే భారతీయులకు ఈ అవకాశం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం సులభతరమవుతుందని క్రిస్ వివరించారు.
దరఖాస్తుదారుడి అనుమతితో మూడో వ్యక్తి అంటే.. కుటుంబసభ్యుడు, ట్రావెల్ ఏజెంట్, వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు చేయడం, పత్రాల సమర్పణ సంబంధిత ప్రక్రియ వేగవంతమవుతుందని ఎల్స్టాఫ్ట్ అన్నారు. ఆస్ట్రేలియాకు వచ్చే పర్యాటకులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారని చెప్పారు. గతేడాదితో పోలిస్తే భారతీయ పర్యాటకులు 15.4శాతం పెరిగినట్లు క్రిస్ వివరించారు.