మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటన రైలు ఆలస్యం కావడం వల్లే చోటుచేసుకుందని తెలుస్తోంది. వాస్తవానికి నాందేడ్ ప్యాసింజర్ నేడు నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆ ఆలస్యమే చిన్నారుల పాలిట మృత్యుఘడియలుగా మారింది. మాసాయిపేట లెవల్ క్రాసింగ్ ద్వారా ప్రయాణించే డ్రైవర్లందరికీ రైళ్ళ రాకపోకల సమయాలు తెలిసి ఉంటాయి కాబట్టే, ఆ సమయంలో ఏ రైలూ రాదని కాకతీయ విద్యామందిర్ స్కూల్ డ్రైవర్ మొండిగా బస్సును ముందుకురికించి ఉంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, పట్టాలపైకి వచ్చిన బస్సును ఒక్కసారిగా చూసినా బ్రేకులు వేయలేని నిస్సహాయత రైలు డ్రైవర్లది. సడెన్ బ్రేక్ వేస్తే మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉండడంతో వారు నిదానంగా బ్రేకులు వేయగా, బస్సును ఢీకొన్న రైలు అరకిలోమీటరు తర్వాత నిలిచిపోయింది. ఇక మరోపక్క  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక విలపించారు. కాసేపటి తర్వాత మృతుల తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చారు. అనంతరం అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: