'ఐస్ బకెట్ ఛాలెంజ్' సృష్టికర్తల్లో ఒకరైన కోరీ గ్రిఫిన్ (27) మృతి చెందాడు. నిన్న (శనివారం) మసాచుసెట్స్ లోని నాన్టుకెట్ ఐలండ్ లో ప్రముఖ డైవింగ్ స్పాట్ లో ఓ భవనం పైనుంచి అతను నీళ్లలోకి దూకి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన చేసిన నాన్టుకెట్ పోలీసులు, కోరీ నీళ్లలోకి దూకిన వెంటనే నీటిపైకి తేలాడని... తర్వాత మళ్లీ లోపలకు వెళ్లి ఇక పైకి రాలేదని ఓ సాక్షి తెలిపాడన్నారు. దాంతో, దగ్గరలోని లైఫ్ గార్డ్ ని పిలిపించి బయటికితీసి ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు చెప్పారని వెల్లడించాడన్నారు. తన స్నేహితుడు నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో ప్రేరణ చెందిన కోరీ నరాల వ్యాధిపై చైతన్యం కలిగించాలని తలచాడు. వెంటనే చారీటీ కోసం 'ఐస్ బకెట్ ఛాలెంజ్'ను రూపొందించాడు. అంటే బకెట్ లోని చల్లటి నీళ్లను తలపై గుమ్మరించుకోవాలి. ఒకవేళ చేయలేకపోతే వంద డాలర్లను ఏఎల్ఎస్ అసోసియేషన్ (అమియోట్రోపిక్ లేటరల్ స్కెలెరోసిస్)కు విరాళంగా ఇవ్వాలి. అమెరికాలో ప్రారంభమైన ఈ ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: