సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పలు ప్రత్యేకతలతో ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో నిన్న విడుదల చేసింది. విస్తృతమైన భారత మార్కెట్లో విడుదల చేసిన దీని ధర 6,399 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇంటర్నెట్‌ను మరో వంద కోట్ల మందికి అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకువచ్చామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఆండ్రాయిడ్ -క్రోమ్-యాప్స్ విభాగం) సుందర్ పిచ్చయ్య చెప్పారు. ఫోన్ ప్రత్యేకతలు: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో 4.5 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరి, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరి, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వంటి ప్రత్యేకతలున్నాయి. ఏడు భారత ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసేలా ఆండ్రాయిడ్ ఓఎస్‌ను మరింత మెరుగుపరచడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ భాషల్లో డేటా వినియోగం పెంపు, యాప్‌లను ప్రమోట్ చేయడానికి ఇది ఉపకరిస్తుందని గూగుల్ భావిస్తోంది. ఈ కంపెనీల ఫోన్‌లను అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెట్ సంస్థల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెల నుంచి రిటైల్ స్టోర్స్‌లో కూడా ఇవి అందుబాటులోకి వస్తాయి. మరోవైపు ఉచిత డేటా కోసం గూగుల్ సంస్థ ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: