చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా భారత మార్కెట్ పై కన్నేసింది. భారత్ లోని అపార అవకాశాలను కొల్లగొట్టేందుకు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సొంతంగా కార్యకలాపాలు సాగించడంతో పాటు భారత్ లో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలు, వ్యక్తులతో కలిసి పనిచేసే విషయాలను కూడా జాక్ మా పరిశీలిస్తున్నారు. భారత్ లో తొలి పర్యటనకు వచ్చిన జాక్ మా బుధవారం ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొని కీలకోపన్యాసం చేశారు. భారత్ లోని అపార అవకాశాలను ప్రస్తుతిస్తూనే, వాటిని చేజిక్కించుకునేందుకు తాను కూడా ఉవ్విళ్లూరుతున్నానని చెప్పారు. తన పర్యటనలో భాగంగా నేడు ఆయన పలు కంపెనీలతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా దేశీయ ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ తో ఆయన సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్నాప్ డీల్ లో జాక్ మా వాటా తీసుకుంటారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనా అపర కుబేరుడైన జాక్ మా భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. తాను మోదీ ప్రసంగాన్ని విన్నానని, ఆ ప్రసంగం ఉత్తేజపూరితంగా ఉందని చెప్పారు. అంతేకాక మోదీ ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: