అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ద్వారా చంద్రబాబు సంగతేమో కానీ.. కేసీఆర్ మాత్రం మాంచి ఖుషీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే నరేంద్రమోడీ అమరావతి టూర్ లో చంద్రబాబు కంటే కేసీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఆంధ్రాకు భరోసా ఇవ్వాల్సిన సమయంలోనూ నరేంద్ర మోడీ తెలంగాణ- ఆంధ్రా సంబంధాలపై మాట్లాడటమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
చంద్రబాబు కేసీఆర్ ను పిలవడం, కేసీఆర్ రావడం చాలా సంతోషంగా ఉందని నరేంద్రమోడీ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ తర్వాత కేసీఆరే ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. దీనికి తోడు కేసీఆర్ తన పర్యటన మొత్తం ప్రధాని నరేంద్ర మోడీని అంటిబెట్టుకునే ఉండడం అందరినీ ఆకట్టుకుంది.
నరేంద్ర మోడికి స్వాగతం పలికిన సమయం మొదలుకుని.. అమరావతి త్రీడీ ఆర్ట్ గ్యాలరీ సందర్శన సమయంలోనూ.. యాగశాలలో గానీ కేసీఆర్ మోడీని అనుసరించే ఉన్నారు. ఆయనకు తోడు నీడగా కనిపించారు. మోడీ కూడా కేసీఆర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. శిలా ఫలకం ఆవిష్కరణ సందర్బంలో ఆయన ప్రత్యేకంగా కేసీఆర్ ను మోడీ రమ్మని పిలిచి పక్కన నిలబెట్టుకున్నారు.
ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉన్న కార్యక్రమం కావడంతో మోడీ ఇద్దరికీ ప్రయారిటీ ఇచ్చారు. కాకపోతే.. కేసీఆర్ తో కాస్త ఎక్కువ చనువుగా వ్యవహరించారు. కేసీఆర్ కూడా హుందాగా నడుచుకుని అందరి మనసు చూరగొనే ప్రయత్నం చేశారు. చంద్రబాబును సంబోధించే సమయంలోనూ.. మోడీకి గౌరవం ఇచ్చే సమయంలోనూ విజ్ఞత ప్రదర్శించారు. అమరావతికి హైదరాబాద్ అన్నివిధాలా చేయూత ఇస్తుందని చెప్పి జేజేలు కొట్టించుకున్నారు.