ఒకరి నిర్లక్ష్యం ఖరీదు ఎంతో భవిష్యత్ ఉన్న ఓ చిన్నారి నిండు జీవితాన్ని బలికొంది. దేశంలో బోరు బావులు తవ్విన తర్వాత వాటిని పూడ్చి పెట్టాలని ఎన్ని సార్లు ప్రభుత్వాలు హెచ్చరించినా కొంతమంది నిర్లక్ష్య వైఖరి వల్ల చిన్న పిల్లలు అందులో పడటం జరుగుతుంది. ఒక్కోసారి రిస్క్యూటీమ్ ఎంతో శ్రమకోర్చి పిల్లల్ని రక్షించినా కొన్ని సార్లు విఫలం అవుతుంటారు.. ఇది మానవ తప్పిదం అయినా ప్రభుత్వాల వైఫలం అని అంటారు కొందరు.
మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు తాగునీటి బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, 108 సిబ్బంది బాలుడ్ని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాకుమ్మరి రాములు అనే రైతు శనివారం తెల్లవారుజామున బోరు వేయగా అందులో నీరు రాలేదు. బోరు బావిపై మూత వేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. రాకేశ్(3) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు.
పొక్లెయిన్తో బోరు బావికి సమాంతరంగా మరో బావి తవ్వుతున్నారు. సహాయక చర్యలను ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. బావిలోకి ఆక్సిజన్ ను పంపించారు. రిస్క్యూటీమ్ ఎంత కష్టపడ్డా.. 40 అడుగుల లోతులో బండరాళ్లమధ్య తలకిందులుగా చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు చిన్నారి రాకేశ్. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు వెలికితీశాయి. కాగా, సహాయక చర్యల్లో ఆలస్యమే బాలుడి మరణానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే వేసిన బోరు, పసిబిడ్డకు కొత్తగా కనిపించడంతో తన సోదరుడు బాలేష్తో కలిసి ఆడుకోవడానికి వెళ్లి బోరు బావిలో పడిపోయిన సంగతి తెలిసిందే.