గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు తమ గెలుపుకోసం వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఎవరికి వారు తమ తమ పార్టీ జెండాను గ్రేటర్ పై ఎగరవేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు చాలా రోజుల తరువాత హైదరాబాద్ కు వచ్చారు. పార్టీ వర్గాలతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం తమ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. పార్టీనాయకులు దాదాపుగా గ్రేటర్ పైనే దృష్టి సారించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం పథకం గ్రేటర్ హైదరాబాద్ లోనే ప్రారంభించారు. ఇది ఆ పార్టీ ప్లస్ పాయింటేనే చెప్పాలి. ఇక పోతే గ్రేటర్ ప్రధానంగా పోటిలో ఉండబోతున్న తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టాలని గులాబీ దళం వ్యూహాలకు పదును పెట్టింది. ఇందుకు కోసం ఓటు కు నోటు వ్యవహారాన్ని హస్త్రంగా చేసుకోవాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడం.. ఎవరికి వారు తమ తమ పార్టీలు
ఇకపోతే.. చాలా రోజుల తరువాత ఓటుకు నోటు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడం.. ఎవరికి వారు తమ తమ పార్టీలు గ్రేటర్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం. అయితే ఈ క్రమంలో గ్రేటర్ లో టీఆర్ఎస్ పార్టీ ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రధాన చర్చకు తీసుకు వచ్చి గెలుపు దీశగా ముందుకు వెళ్లాలని యోచిస్తోందని రాజకీయ మేదావులు అభిప్రాయపడుతున్నారు!. ఇకపోతే, తాజాగా.. టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మరోసారి మాటల తుటాలు పేలుతున్నాయి. ఎవరికి వారు తమ తమ నోటికి మరోసారి పనిచెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ గ్రేటర్ సీనియర్ నేత, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ చెక్ పెట్టే హస్త్రం మా వద్ద ఉందని తెలిపారు. ఈ క్రమంలో నే ఓటుకు నోటు వ్యవహారం మరోసారి చర్చకు రావడం గమనించదగ్గ విషయమే. ఇదీలా ఉండగా.. ఓటుకు నోటు వ్యవహారం గత 3 నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చే జరిగింది. ఇరువురి సీఎంలు మధ్య భారీ మాటల యుద్దమే జరిగిందని చెప్పాలి. ఒకనొక దశలో ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తప్పది అన్న వార్తలు వచ్చాయి.
అప్పట్లో ఓటుకు నోటు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డి , సండ్రవెంకటవీరయ్య ల అరెస్ట్ లు జరిగాయి. 5 కోట్ల కు ఒప్పందం కుదుర్చుకుని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ తో సంభాషించింది ఏపీ సీఎం చంద్రబాబేనని ఆడియో టేపులు బహిర్గతం చేసింది ఏసీబీ. అయితే ఇక చంద్రబాబు ఆరెస్ట్ తప్పదా అన్న వాతావరణం ఏర్పడింది. అయితే చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్, తమ అధికారుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న వార్తను తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో ఇరువురి మద్య భారీ యుద్ధమే జరిగిందని చెప్పాలి. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ పాలన అంతగా సేఫ్ కాదని భావించిన చంద్రబాబు తన పాలనను విజయవాడకు తరలించారు. క్రమ క్రమంగా ఓటుకు నోటు వ్యవహారం కనుమరుగయ్యింది. కానీ ఇరువురి చంద్రుల మధ్య దూరం మాత్రం పెరుగుతూ వచ్చింది. గత కొద్ది రోజుల క్రితం అమరావతి శంకుస్థాపనకు రావలసిందిగా చంద్రబాబు కేసీఆర్ ఇంటికి వచ్చి అహ్వానించడం.. దీంతో కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం తో ఇక ఓటుకు నోటువ్యవహారం కథ ముగిసినట్టే నని అందరూ భావించారు.
అనూహ్యాంగా మరోసారి ఓటుకు నోటు వ్యవహారం చర్చకు వచ్చింది. తాజాగా రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. రేవంత్ రెడ్డి, జేరుసలేం మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్యల ఆడియో టేపులు నిజమేనని ఎఫ్ఎస్ఎల్ నివేదించింది. ఈ క్రమంలో చంద్రబాబు స్వర నమూనాలను సేకరించాలని ఏసీబీ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా కనుమరుగయిందని భావించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడం, ఇదీ ముమ్మాటికి టీఆర్ఎస్ గ్రేటర్ వ్యూహమేనన్న అనుమానాలు తావిస్తోంది. ఇది ఇలా ఉండగా.. చాలా రోజుల తరువాత ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ వర్గాలను సమాయత్తం చేయడంలో బీజిగా గడుపుతున్నారు. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే గత వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం. వరంగల్ లో ఘోర ఓటమి పాలు కావడం తో ఇక రంగంలోకి దిగాలని భావించిన చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ క్రమంలో చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సీమాంద్ర ఓట్లను ఎక్కువగా ప్రభావితం చేయాలన్న యోచనలో పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ అభివృద్ది కేవలం తెలుగు దేశం పార్టీ హయాంలో నే జరిగిందని చెబుతూ ఓటు బ్యాంక్ ను తమవైపు తీప్పుకోవాలని చంద్రబాబు తీవ్రంగా కృషి చేసేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశగా ఆయన హైదరాబాద్ లో బీజి బీజిగా గుడుపుతున్నారు. అంతేకాకుండా రానున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుపు దీశగా ప్రయత్నాలు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కూడా పక్కా ప్రణాళికలతో ముందుకు పోతుంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధానం హస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది క్రితమే.. గ్రేటర్ లో ఉన్నప్రధాన టీడీపీ నాయకులను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వనించడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే కొట్టింది అధికార టీఆర్ఎస్.
ఇకపోతే గ్రేటర్ లో దాదాపుగా అధికార టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ల మద్యే గట్టిపోటి ఉండనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు గెలుపు దిశగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రధాన అంశంగా ముందుకు తీసుకువచ్చి తెలుగు దేశం పార్టీకి చెక్ పెట్టి, గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరవేయాలని పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇరువురి పార్టీ నేతల మద్య మరోసారి మాటల యుద్ధాలు మొదలయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.