కాపులకు రిజర్వేషన్ అంశం ఏపీ చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతోంది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఈ రిజర్వేషన్ల వ్యవహారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సమయంలో తమకు మిత్రుడుగా భావించే జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ సైతం తమపై ఒత్తిడి తేవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.
మొన్నటికి మొన్న తుని కాపు ఐక్య గర్జన విధ్వంసం తర్వాత మీడియా ముందుకు వచ్చిన పవన్.. ఎవరికీ అర్థంకాని రీతిలో స్పందించి మళ్లీ వెళ్లిపోయారు. దీనిపై సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ విమర్శలు రావడంతో పవన్ కాస్త మేలుకున్నట్టున్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. ప్రభుత్వం కాపుసంఘం నేతలతో నేరుగా చర్చించి సమస్య పరిష్కరించాలన్నారు.
పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో కోరారు:
— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2016
కాపు రిజర్వేషన్ల అంశంలోఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో కోరారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మేధావులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు. పవన్ కూడా కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టే సరికి టీడీపీ నాయకులకు గుండెల్లో గుబులు మొదలైంది.
ఇక ఎదురుదాడికి మరింత పదను పెట్టాలని భావించిన టీడీపీ నాయకులు పాత చిట్టాలన్నీ ముందేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వేసిన బిసీ కమిషన్ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సర్వే చేసేందుకు 2008లో 45లక్షలు అడిగితే 2011లో కేవలం 10లక్షలు మాత్రమే విడుదల చేసిందన్న విషయాన్ని కనిపెట్టారు.
మంత్రి నారాయణ ఆ పాత జీవోను వెలికి తీసి.. మీడియా ముందు ప్రదర్శించారు. లక్షా 40వేల కోట్ల బడ్జెట్ ఉన్న సమయంలో కేవలం 10లక్షలు విడుదల చేసిన ప్రభుత్వంలో మంత్రి పదవులు వెలగబెట్టిన వారు ఇపుడు ముద్రగడకు మద్దతివ్వటం... ఆయన తీసుకోవటం సిగ్గుచేటని కౌంటర్లు మొదలు పెట్టారు.