అందంగా ఉండాలని కోరుకోని మహిళ ఈ భూప్రపంచం మీదే ఉండదేమో.. కానీ అదే తమ అందం తమకు శత్రువుగా మారిన ఆడవాళ్లు మాత్రం చాలా మందే ఉంటారు. కేవలం అందంగా ఉండటం మాత్రమే వారు చేసిన పాపం. అలాంటి అందగత్తెలు ఉద్యోగం కోసమో.. ఉపాధి కోసమో గడప దాటితే అందుకోవాలని ఆత్రపడే పురుషపుంగవులే సమాజం నిండా.
అలాంటిది ఆ అందగత్తె ఓ చిరుద్యోగి అయితే.. ఎందరు మగాళ్లు ఎన్నిరకాలుగా హింసిస్తారో చెప్పాలంటే అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాలు తెలుసుకోవాల్సిందే. ఇక్కడి ఎంపీటీసీ సభ్యుడు ఓ అందమైన అంగన్వాడీ కార్యకర్తపై మనసుపడ్డాడు. తాను ఓ ప్రజా ప్రతినిధినన్న వాస్తవం కూడా మరచి కామవాంఛ తీర్చమంటూ వెంటపడ్డాడు.
నేను అలాంటిదాన్ని కాదు.. నాకు పెళ్లైంది.. నా మానాన నన్ను వదిలేయమని బతిమాలుకున్నా.. సదరు ప్రజాప్రతినిధి కరుణించలేదు. నా కింద పనిచేసే ఉద్యోగివి.. నన్ను కాదని ఎక్కడకు వెళ్తావో చూస్తా.. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టారు.
చివరకు ఆ వేధింపులు తాళలేని ఆ అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి.. మహిళాసంఘాలను ఆశ్రయించింది. తన గోడు వెళ్లపబోసుకుంది. ఆ తర్వాత అనంతపురం మీడియా ముందుకు వచ్చిన రాజేశ్వరి కొంతకాలంగా తాను పడుతున్న మానసిక వేదనను వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయింది.
తాను చెప్పినట్లుగా వినకపోతే ఉద్యోగం తీసేయిస్తానని ఎంపీటీసీ సభ్యుడు కె.శ్రీనివాసులు బెదిరిస్తున్న రాజేశ్వరి చెప్పింది. ఆమెకు అనంత మహిళా సంఘం నేతలు మద్దతు తెలిపారు. ఇకనైనా పోలీసులు ఈ సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మహిళా సంఘం నేతలు హెచ్చరించారు.