కేంద్ర బడ్జెట్ 2016-17 - ఆసక్తికర విశేషాలు

కేంద్ర బడ్జెట్.. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతుల తలరాతలను మార్చే పద్దుల చిట్టా. దీని ఆధారంగానే కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని తక్కువ ధరకే లభ్యమవుతాయి. దీని ఆధారంగానే దేశ ప్రజల ఇంటి బడ్డెట్ కూడా రూపుదిద్దుకుంటుంది. సులభమైన భాషలో చెప్పాలంటే.. ఒక ఏడాదిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తాల ప్లానింగ్ పత్రం అన్నమాట. 

ఏడాది అంటే జనవరి 1 నుంచి కాకుండా.. ఆర్థిక సంవత్సరం అంటే.. ఏప్రిల్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. అందుకే.. ప్రతి ఏటా ఫిబ్రవరి 28 లేదా 29 తేదీల్లో ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి వివరిస్తారు.


బడ్జెట్ ఎలా రూపొందిస్తారు..? 

రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన రెవెన్యూ బడ్జెట్ రూపొందితే, క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన క్యాపిటల్ బడ్జెట్ రూపొందుతుంది. కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత. చాలా తతంగమే ఉంటుంది.


బడ్జెట్ కసరత్తు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..?

సెప్టెంబర్ చివరి నుంచే రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది. అక్టోబర్ చివర్లో తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చలు జరుపుతారు. 

డిసెంబర్ లో ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరిలో పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.


బడ్జెట్ ముద్రణ ఎలా..? 

బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది.

ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

అత్యవసర సమయాల్లో ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

 కేంద్ర బడ్జెట్ 2016-17కు సంబంధించిన మరిన్నిఆసక్తికర విశేషాలు మరికొన్ని కథనాల్లో తెలుసుకుందాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: