విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలకు ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. ఇక ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో ఉంది కనుక ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే జరపాలా లేదా తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి అక్కడ నిర్వహించాలా అన్న తర్జన భర్జనలో కొనసాగింది. సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలకు నిర్వహణకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగింది. మార్చి మొదటివారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే మార్చి1న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించటంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. మార్చి 23 తరువాత స్పీకర్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండటంతో. 23న సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం మార్చి 5న 2016-17 వార్షిక బడ్జెట్ను,.మార్చి8న ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్ తదితరులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దాదాపు రూ. 1,32,000 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అసెంబ్లీ
ఇక బడ్జెట్ లో వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఐటి, స్వయం ఉపాధి తదితర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచిస్తున్నారు. బడ్జెట్ మొత్తం 2015-16కంటే 19 వేల కోట్ల రూపాయలు అధికంగా ఉంటుందని స్పష్టమవుతోంది. గతేడాది ఏ శాఖ సమర్థవంతంగా నిధులను ఉపయోగించిందో నిర్ణయించి, ఆయా శాఖలను ప్రోత్సహించాలని సర్కారు భావిస్తోంది.