కన్నప్రేమ కంటే పెంచిన మమకారం ఇంకా గొప్పదంటారు. కానీ అవన్నీ హృదయమున్న మనుషుల విషయలోనే అని ఓ కిరాతకుడు రుజువు చేశాడు. చేతులారా పెంచిన కూతురినే స్వయంగా వ్యభిచార కూపంలోకి దింపేశాడు. డబ్బు కోసం అడ్డమైన గడ్దీ తినడానికి ఏమాత్రం వెనుకాడని మనుషులు లోకంలో ఎందరో ఉన్నారనడానికి గోవింద్ అనే ఈ మానవ మృగమే ఓ ఉదాహరణ.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో జహీరానగర్ అనే ఓ బస్తీ ఉంది. అక్కడ నివసించే పద్మ, రమేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మౌనిక, సోనిలు చిన్నప్పుడే వారి తండ్రి రమేష్ చనిపోయారు. తల్లి పద్మ సమీపంలోని ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తూ మద్యానికి బానిసైంది.
కేవలం మద్యానికి బానిసవ్వడమే కాదు.. గోవింద్ అనే వివాహిత యువకుడితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. ఆ ఇద్దరు ఆడపిల్లలను తాము పెంచుకుంటామని గోవింద్ భార్య లక్ష్మీ పద్మకు చెప్పి ఒప్పించింది. ఆ తర్వాత పద్మ మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైంది.
అప్పటి నుంచి ఆ ఆడపిల్లలిద్దరూ గోవింద్, లక్ష్మీల దగ్గరే పెరిగారు. పెంచిన తండ్రయిన గోవింద్ మౌనికకు వయసుకు రాగానే ఆమెను వ్యభిచారం కూపంలోకి దింపాడు. నిత్యం డబ్బులు వసూలు చేస్తూ విటులు కోరిన చోటుకు పంపేవాడు. ఈ వేధింపులు భరించలేక పెద్ద కూతురు ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో తన కూతురు అదృశ్యమైదంటూ బంజారాహిల్స్ పోలీసులకు గోవింద్ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ కూతురు ఆచూకీ కనుక్కుని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. తనతోపాటు తన 13 ఏళ్ల వయసున్న చెల్లిని కూడా వ్యభిచార కూపంలోకి నెట్టారని పోలీసుల ముందు పెద్ద కూతురు తన గోడు వెళ్లబోసుకుంది. పోలీసులు నిందితుడు గోవింద్ను అరెస్టు చేశారు. అతని భార్య లక్ష్మీపై కూడా కేసు నమోదు చేశారు.