తీవ్ర కరువు నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటిని అందించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్ సూచించారు. నీటి నిల్వలను కేవలం ప్రజలు, పశువుల తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని కోరారు. వలసల నివారణ కోసం ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఒక్కొక్కరికీ 20 కేజీల రేషన్ బియ్యాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులు, ఏ ఆసరాలేని వారికి మధ్యాహ్నభోజన పథకం కింద ఆహారాన్ని అందించాలన్నారు. గ్రామాల్లో మొబైల్ వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటిం చాలని, కరువుపై ప్రభుత్వ పెద్దలకు తెలిసేలా త్వరలో మేధావులతో మౌనదీక్ష చేపడతామని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'తెలంగాణ కరువు పరిస్థితులపై సమాలోచన' సమావేశం జరిగింది. అందులో అమోదించిన తీర్మానాలను కోదండరామ్ వెల్లడించారు. కరువు సమస్యపై గవర్నర్కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. దీనిపై ఎలా ముందుకుపోవాలన్న దానిపై ఒక సబ్ కమిటీ వేశామని, దాని సూచన మేరకు నడుచుకుంటామని తెలిపారు.
విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ తన గ్రామంలో 60 శాతం మంది వలసెళ్లారని, ఊర్లో వృద్ధులు మాత్రమే ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న గ్రామాలు నేడు బిచ్చమెత్తుకునే స్థితిలో ఉన్నాయని, ఆ ఉద్యమం ఫలితంగా గద్దెనెక్కిన సర్కారుకు ఆ పల్లెల గోడు పట్టట్లేదని వాపోయారు. గ్రామాల్లో 'సార్ కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులలో ఎవరినైనా ఒకరిని తమ గ్రామానికి తీసుకొచ్చి మా బాధలు చూపండి' అంటూ ప్రజలు మొరపెట్టుకుంటున్నారన్నారు. తాను ఊరి నుంచి వచ్చి అక్కడి పరిస్థితులపై వ్యాసాలు రాస్తే 'సార్.. వేరే ఏదైనా రాయండి. ఇది మాత్రం వద్దు' అని కొన్ని పత్రికలు తిరస్కరించాయన్నారు. నాయకులు చెప్పేవే రాసి వారిచ్చిన కవర్లతోనే విలేకరులు బతికే దురావస్థకు వచ్చారన్నారు.
ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కరువుపై విన్నవిద్దామంటే తమను కలిసేందుకు సీఎం సిద్ధంగా లేరన్నారు. ప్రజలు సంయమనంతో ఉంటున్నారని, కరువుపై పాలకులు ఇట్లాగే నిర్లక్ష్యం వహిస్తే తిరగబడతారని హెచ్చరించారు. ప్రతిపక్షాలు బలహీనపడితే ప్రజలే ప్రతిపక్షమవుతారన్నారు. తెలంగాణలో సుసంపన్నమైన వారసత్వం ఉన్నదని, వారు ఉద్యమించే రోజలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల రాలేదని, ఇది ముమ్మాటికీ పాలకుల వైఫల్యమేనని అన్నారు. ప్రాజెక్టులు నిండాక చెరువులు నింపే విధంగా కొత్త జలవిధానం తీసుకురావాలని చెప్పినా పాలకులకు చెవికెక్కడం లేదన్నారు. ఏపీలో పట్టిసీమ పథకంతో దాదాపు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖ సమన్వయంతో పనిచేస్తే కరువును తరిమికొట్టవచ్చన్నారు. ఈ సమావేశంలో రమామేల్కోటే, వ్యవసాయ రంగ నిపుణులు రామాంజనేయులు, అడ్వకేట్ జేఏసీ నాయకులు ప్రహ్లాద్, నిజాం కాలేజీ ప్రొఫెసర్ పురుషోత్తం, అఖిల భారత రైతుకూలి సంఘం నాయకులు అచ్యుతరామయ్య, రైతు స్వరాజ్యవేదిక నాయకులు రవి, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాయకులు ఖాజామొయినొద్దీన్, సీపీఐ నాయకులు నర్సింహారెడ్డి, సజయ, విద్యుత్ జేఏసీ నాయకులు రఘులతో పాటు పలు ప్రజాసంఘాలు, జేఏసీల ప్రతినిధులు పాల్గొన్నారు.