అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి రెచ్చిపోయింది. తెలుగు దేశం పార్టీలో గ్రూపుల గొడవలు ముదురుతున్నాయి. ఇన్నాళ్లూ.. నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. పరిటాల సునీత వర్గం, ఆమె ప్రత్యర్థి వర్గం మధ్య ఎత్తులు జిత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వర్గీయుడి ఇంటిపైనే సొంత పార్టీకి చెందిన వారు దాడికి దిగడం కలకలం రేపుతోంది. 

తాజాగా పరిటాల సునీత, ఆమె కుమారుడు ఘనంగా చేయించిన సామూహిక వివాహాలు తాజా గొడవలకు దారి తీశాయి. ఈ వివాహాలను ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం పిలిపించి వైభవంగా నిర్వహించి జిల్లాలో తమ ప్రాబల్యం , సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేశారు. దీన్ని పసిగట్టిన పరిటాల సునీత వ్యతిరేక వర్గం ఈ వివాహాల కార్యక్రమానికి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేసింది. 

సునీత పలుకుబడి తగ్గించేందుకు ఆమె వ్యతిరేకవర్గానికి చెందిన వారు చాలా ప్రయత్నాలు చేశారు. జిల్లాలోని టీడీపీ వర్గాలు వర్గాల వారీగా చీలిపోయిన నేపథ్యంలో ఈ వివాహాల కార్యక్రమానికి కార్యకర్తలు రాకుండా బెదిరించారట. ప్రత్యేకించి ధర్మవరానికి చెందిన ఓ ప్రముఖ టీడీపీ నేత  సురేష్‌నాయుడు అనే స్థానిక నేతను ఈ కార్యక్రమానికి వెళ్లవద్దని వారించారట. 

పరిటాల వర్గానికి చెందినవాడిగా గుర్తింపు ఉన్న సురేశ్ నాయుడు తమ వర్గనాయకుల మాటలను ధిక్కరించి మరీ పరిటాల సామూహిక వివాహాలకు హాజరయ్యాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న పరిటాల వ్యతిరేకవర్గం ఆ పగను కడుపులో పెట్టుకుని సురేశ్ నాయుడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో ఇల్లు పాక్షికంగా దగ్దమైంది. సురేశ్ వాహనంకూడా తగలబడిపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: