పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకంలో హింస చెలరేగే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బాంబులు లభించడం కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మరింత క్షుణ్నంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు.
ఇదే సమయంలో ఉత్తర మిడ్నాపూర్లోని 144వ పోలింగ్ కేంద్రం దగ్గర కూడా నాలుగు బాంబులను పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ కు సరైన సమయంలో సమాచారమందించడంతో వారు ఆ బాంబులను నిర్వీర్యం చేయడంతో ముప్పు తప్పింది. ఈ రెండు ఘటనలు నేపథ్యంలో తుది విడతలో హింస చెలరేగుతుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రశాంతంగా ముగిసేనా..!?
చివరి దశ పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 361 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 50 వేల మంది మంది వరకూ సైన్యాన్ని ఎన్నికల విధులకు కేటాయించారు. కీలక ప్రాంతాలైన కూచ్బెహర్ జిల్లాలో 4,500 మంది పోలీసులతో పాటూ 123 కంపెనీల భద్రతా సిబ్బంది.. ఈస్ట్ మిద్నాపూర్ జిల్లాలో 7,500 పోలీసులతో పాటూ 238 కంపెనీల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
ఈ రెండు జిల్లాల్లోని 25 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇవి సరిహద్దు జిల్లాలు కావడంతో ఎన్నికల అధికారులు ఇప్పటికే సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఆరోదశలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగుతుంది. చివరి విడత కావడంతో ఆఖరి క్షణం వరకూ పార్టీలు తమ శక్తియుక్తులు ప్రయోగిస్తున్నాయి.