తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పటివరకూ పెద్దగా జనానికి షాక్ ఇచ్చింది లేదు. ఆ మధ్య ఆర్టీసీ రేట్లు పెరిగినా.. గతంలో రేట్లు పెరిగి చాలా కాలమైంది కాబట్టి జనం కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రజలకు కష్టకాలం వచ్చినట్టే ఉంది. అదేంటంటే.. త్వరలోనే తెలంగాణ కరెంట్ రేట్లు పెరగబోతున్నాయి.
ఈ మేరకు అన్ని పత్రికల్లోనూ కర్టెన్ రైజర్ స్టోరీలు వచ్చేశాయి. అంటే జనాన్నిమెల్లగా అలవాటు చేస్తున్నారన్నమాట. మెల్లగా లీకులు ఇచ్చి జనం ఇక తప్పదని ఫిక్స్ అయ్యాక అప్పుడు విద్యుత్ చార్జీల పెంపు ప్రకటన ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి మాత్రం.. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం తప్పేట్లు లేదని డిస్కమ్ లు సీఎంకు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కరెంటు వాత తప్పదు.. కాచుకోండి..
తాజా లెక్కల ప్రకారం సగటున 9 శాతం మేర ఛార్జీల పెంపునకు ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితే కనిపిస్తోందట. ! ఆ మేరకు ఛార్జీలను పెంచకుంటే తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థలు కుప్పకూలిపోతాయట. ఇది భవిష్యత్లో విపరిణామాలకు దారితీస్తుందట. ఈ మేరకు విద్యుత్సంస్థల ఉన్నతాధికారులు కేసీఆర్ కు చెబుతున్నారట.
ఫైనల్ గా ఈ ఆర్థిక సంవత్సరంలో 9శాతం ఛార్జీల పెంపునకు డిస్కమ్లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదముద్ర వేశాయి. ఒకేసారి పెంచితే బావోదనుకున్నారో ఏమో మొదట చార్జీల పెంపుకు సీఎం కేసీఆర్ విముఖత చూపించినట్టు కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మాత్రం పెంపు తప్పదన్నట్టుగానే కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా జనం 9 శాతం వాతకు రెడీగా ఉండాల్సిందే అన్నమాట.