ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ చేతులెత్తేసింది. ఇక ఈ రంగంలో తాను కొనసాగలేనని డిసైడ్ అయ్యింది. అందుకే పోటీ నుంచి వైదొలగాలని భావించింది. ఆ మేరకు గుడ్ బై చెప్పేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇది స్మార్ట్ ఫోన్ ల తయారీ విషయంలోనే సుమా. ఈ రంగంలో తాను అంతగా సక్సస్ కాకపోవడం, ప్రత్యర్థుల నుంచి విపరీతమైన పోటీ కారణంగా మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్ రంగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్ నుంచి తయారైన లూమియా, విండోస్ ఫోన్లు అంతగా జనాదరణకు నోచుకోలేదు. అందుకే స్మార్ట్ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెండేళ్ల క్రితం నోకియా నుంచి 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ ప్రయోగానికి స్వస్తి పలకనుంది. ఈ నిర్ణయంతో కంపెనీ దాదాపు 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
చేతులెత్తేసిన మైక్రో సాఫ్ట్..
ఫిన్లాండ్కు చెందిన టెలికాం ఎక్వి్పమెంట్ తయారీ కంపెనీ నోకియా నుంచి స్మార్ట్ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ రెండేళ్ల క్రితం 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్ఫోన్లను తీసుకురాలేక నోకియా మార్కెట్ వాటాను క్రమంగా కోల్పోయింది. ఇదే తరుణంలో తన వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కు విక్రయించింది.
మైక్రోసాఫ్ట్ కూడా కస్టమర్ల నాడిని పట్టుకోలేకపోయింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో కూడిన స్మార్ట్ఫోన్ల హవాకు తట్టుకోలేక చతికిల పడింది. నవతరం టెలి కాం సర్వీసులకు అనుగుణంగా ఇతర కంపెనీలు ఫోన్ల ను తెస్తుంటే.. మైక్రోసాఫ్ట్ మాత్రం నత్తనడకన సాగింది. ఫలితంగా మైక్రోసాఫ్ట్ ఫోన్లను కొనే కస్టమర్ల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే స్టార్ట్ఫోన్ల తయారీకి కంపెనీ మంగళం పాడుతున్నట్టు తెలుస్తోంది.