కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా బీజేపీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో ప్రధానమంత్రిపై విరుచుకుపడింది. మోదీ అధికారంలోకి వచ్చి పలు పథకాలు ప్రకటించినా అవేవీ సామాన్యులకు చేరలేదని, విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక చర్యలు తీసుకోలేదని విమర్శించింది. మిత్రపక్షమైనప్పటికీ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై శివసేన గత కొన్నాళ్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.


ప్రధాని మోదీ నిత్యం చేపడుతున్న విదేశీ పర్యటనలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. మోదీ తాను భారతీయ నివాసియా లేక, ఎన్నారై అన్నది తేల్చుకోవాలని ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా ప్రశ్నించింది. అసోంలో మాత్రమే బీజేపీ గెలిచిందని, మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని, అయినా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పెద్ద ఎత్తున సంబురాలకు సిద్ధమవుతున్నారని సామ్నా తన సంపాదకీయంలో ఎద్దేవా చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో ఏం సాధించారని, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. మాజీ ప్రధానిమన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీకి అసలు పోలికే లేదన్నారు. మన్మోహన్ మాటలు చెప్పే రకం కాదు.. కేవలం చేతల మనిషి అని, అయితే మోదీ మాత్రం మాటలకోరు.. చేతల్లో ఆయన శూన్యమని వ్యాఖ్యానించారు. అంతేందుకు కనీసం మీ నియోజకవర్గం వారణాసి అయినా సరిగా ఉందా, రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేశారా.. యువతకు ఉద్యోగాలు కల్పించారా అని మోదీ పాలనపై సిబల్ తీవ్రంగా మండిపడ్డారు.


కేవలం ప్రకటనలతోనే ప్రభుత్వాలను నడిపిస్తున్నారని, చర్చకు రావడానికి సిద్ధమేనా అంటూ కాంగ్రెస్ నేత సవాల్ విసిరారు.దమ్ముంటే మీ క్యాబినెట్ లోని ఏ మంత్రయినా సరే రెండేళ్ల పాలనపై చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఈ రెండేళ్ల పాలనే అత్యంత దారుణమైన పాలన అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లు వాగ్దానాలతోనే సరిపెట్టారని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కావడం లేదన్నారు. ఆర్ధికాభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, ఉద్యోగాల కల్పన, మొదలైన విషయాలలో మోదీ సాధించినదేమీ లేదని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: