మొదటినుంచి లిటిగెంట్ మాస్టర్ గా ఉన్న ప్రస్త్తుత బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ను టార్గెట్ చేశారు. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించే వరకూ విశ్రమించేలా లేడు. తక్షణమే భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ను తొలగించాలంటూ తన విమర్శల దాడి పెంచారు. కేవలం 15 రోజుల క్రితమే ఆయన ఈ విషయంలో ప్రధానికి రెండు లేఖలు రాశారు.
వడ్డీ రేట్ల పెంచడం ద్వారా రఘురామ్ రాజన్ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కాలం చెల్లినవిగా మారుస్తున్నారంటూ సుబ్రమణ్యస్వామి ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. రఘురామ్ రాజన్ పై ఆయన దేశ ద్రోహం తరహా ఆరోపణలు కూడా చేస్తున్నారు. రఘురామ్ రాజన్ ఇప్పటికీ తన చికాగో విశ్వవిద్యాలయ ఈమెయిల్ చిరునామాను వాడుతున్నారని ఆరోపించారు.
రాజన్.. ప్రపంచ బ్యాంకు గూఢచారా..!?
అంతే కాదు.. ఈ ఈమెయిల్ ద్వారా రఘురామ్ రాజన్ భారత్ కు చెందిన రహస్య ఆర్ధిక సమాచారాన్నిప్రపంచ బ్యాంకులో సహా ఇతర దేశాలకు చేరవేస్తున్నారని స్వామి మండిపడుతున్నారు. భారత్ లో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న రఘురామ్ రాజన్.. తన గ్రీన్ కార్డును రెన్యువల్ చేసుకునేందుకు తరచూ అమెరికా పర్యటనకు వెళుతున్నారంటూ స్వామి మండిపడుతున్నారు.
అందుకే విశాల దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రఘురాం రాజన్ ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని ప్రధానికి రాసిన లేఖలో స్వామి కోరారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి విమర్శలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లో తోసిపుచ్చారు. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. అయితే స్వామి చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవికావడం విశేషం.