ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను మొదటి సారి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలు, నందమూరి వారసులు ఆయన్ని మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాయకుడిగా విమర్శించడం మనకు విదితమే. అయితే, ఈ విషయాలను మనసులో పెట్టుకొన్న నందమూరి వంశంలోని కొందరు బాబు తో సఖ్యతకు నో చెప్పడం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ రేసులో అందరికంటే హరికృష్ణ ముందుంటారు. అయితే నిన్న జరిగిన మహానాడు సభకు హరికృష్ణ గైర్హాజరైనారు. అయితే ఇదే అదునుగా భావించిన హరికృష్ణ బాబుపై విరుచుకుపడ్డారు.


ఎన్టీ రామారావు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. నందమూరి వంశ వీరాభిమానులు, తెలుగువాళ్లు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.


అలా పోరాడిన రోజునే అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ఆనాడు ఇస్తామని మోసం చేశారు, తెస్తామన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని, అందరం కలిసి పోరాడి హోదా తెస్తేనే మనం సిసలైన తెలుగు బిడ్డలం అవుతామని ఆయన అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున బయటకు వచ్చి సమరం చేయాలన్నారు. తెలుగువాడన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం శపథం చేసి పూనుకోవాలన్నారు. అప్పుడే అన్నగారి ఆశయం నెరవేరుతుందన్నారు.

తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‑కు నివాళులర్పించడమే గొప్ప కార్యక్రమమని హరికృష్ణ స్పష్టం చేశారు. తెలుగు జాతి మనుగడ ఉన్నంతకాలం ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారని.. తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానుభావుడని కొనియడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: