వైకాపా గురించి, ఆ పార్టీ నుంచి జరుగుతున్న ఫిరాయింపుల గురించి, పార్టీ అధినేత జగన్ గురించి తాను ఒక్కమాట కూడా మాట్లాడబోనని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీవీ చానల్ ప్రత్యేక హోదాపై ఇంటర్వ్యూకు పిలిచి, ఆపై వైకాపా ప్రస్తావన తేగా ఆయన స్పందించారు. ఈ విషయాలన్నీ మరోసారి మాట్లాడుకుందామని, ప్రస్తుతానికి మీరెంత బలవంతం చేసినా జగన్ గురించి మాట్లాడబోనని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే సమస్యే లేదని, వైఎస్ కు దగ్గరైన వ్యక్తిగా, ఆయన మనసులో ఉన్న భావాలే తన మనసులోనూ ఉన్నాయని చెప్పారు. మరో మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలసి పోటీ చేస్తుందన్న విషయమై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, పార్టీ నుంచి వెళ్లినవారు తిరిగి కాంగ్రెస్ తో కలిసే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు.

 

రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, దుగ్గరాజపట్నం పోర్టు వంటి ఎన్నో అపరిష్కృత అంశాలపై చర్చించాలని కోరుతున్నా, పదేపదే జగన్, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, భవిష్యత్ పొత్తులు తదితరాలపై ప్రశ్నలు అడుగుతున్న టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ మురళీకృష్ణపై కేవీపీ కొంత అసహనాన్ని ప్రదర్శిస్తూ మండిపడ్డారు. "మీరు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు. మీ వ్యూవర్ షిప్ పెంచుకోవడానికి కాంట్రవర్షియల్ సబ్జెక్టు తీసుకొచ్చి, రామాచంద్రరావును కాంట్రవర్షియల్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని కాంట్రవర్షియల్ చేయడానికి, దురదృష్టవశాత్తూ మీరు ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. కొత్త వివాదాలు, చర్చలకు తావిచ్చే అంశాల గురించి అసలు ప్రస్తావించనే వద్దని హితవు పలికారు.


"కేవీపీతో ఇంటర్వ్యూ అంటే జగన్ మోహన్ రెడ్డి గురించి, వైఎస్ రాజశేఖరరెడ్డి గురించిన అంశాలుంటాయని ప్రేక్షకులు అనుకుంటారు. అవి మాట్లాడకుంటే ఎలా?" అంటూ టీవీ 9 ప్రెజంటర్ మురళీకృష్ణ అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నేత కేవీపీ తనదైన శైలిలో స్పందించారు. "జగన్ మోహన్ రెడ్డి అనే వాడు నా మేనల్లుడండీ. వాడు లేకుండా ఎలా ఉంటానండీ? మనం ఆ విషయాలు మాట్లాడుకోవద్దు. అవి కుటుంబ విషయాలు. మా పార్టీ విషయాలు మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు రాష్ట్రం విషయాలు మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా, సమస్యలపై మాట్లాడేందుకే వచ్చాను" అని కేవీపీ బదులిచ్చారు.

 

ఓవైపు జగన్ గురించి మాట్లాడను, అడగద్దు అంటూనే ఆయన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కేవీపీ రామచంద్రరావు. అక్రమాస్తుల కేసులో జగన్ దోషని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. "కాదండీ... దానికి మీరెవరు? నేనెవరు? దానికి మీకేం హక్కుంది? నాకేం హక్కుంది? జగన్ మోహన్ రెడ్డి దోషా? నిర్దోషా? చెప్పడానికి చట్టాలు ఉన్నాయి. కోర్టులు ఉన్నాయి. కేసులన్నీ కోర్టు పరిగణనలో ఉన్నాయి. నాయొక్క పర్సనల్ అభిప్రాయం ప్రకారం, జగన్ మోహన్ రెడ్డికి దోషం అంటడానికి అవకాశం లేదు. కానీ నా అభిప్రాయాన్ని ఏ కోర్టూ పరిగణనలోకి తీసుకోదు" అని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే తనపై కేసులు పెట్టించిందని జగన్ ఆరోపిస్తున్నారు కదా? అని గుర్తు చేయగా, 'నేను ఈ టాపిక్ పై మరొక్క మాట కూడా మాట్లాడను. ప్రత్యేక రాష్ట్రం, హోదా గురించి మాత్రమే మాట్లాడండి' అని అన్నారు. ఇది టీవీ-9 చానల్ లో 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ' కార్యక్రమంలో భాగంగా కేవీపీతో ముచ్చటిస్తున్న వేళ చోటుచేసుకుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: