భారత దేశంలో రోజు రోజు కీ మహిళలకు రక్షణ లేకుండా పోతుందనడానికి ఎన్నో ఉదాహారణలు మనం రోజూ చూస్తేనే ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై, చిన్నారులపై కొంతమంది కామంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని చదువుతూనే ఉన్నాం. అయితే కొంత మంది దుర్మార్గులు అత్యాచారం చేసిన తర్వాత పైశాచికంగా వారిని హింసించి మరీ చంపుతున్నారు. ఇక అత్యాచారాలకు కేంద్ర బింధువైన ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి, చెట్టుకు ఉరివేసి చంపేశారు. దారుణమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..బహ్రైచ్ గ్రామ సరిహద్దులో తన కూతురు చెట్టుకు ఊరివేసుకుని కనిపించడంతో బాలిక తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఈ విషయం బాలిక బంధువులు, గ్రామస్థులకు తెలియడంతో వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా బాలిక తండ్రి గత శుక్రవారమే తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు..వారి విచారణలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఊరి తీసినట్లు తేలింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇమ్రాన్, సర్వ్జిత్ యాదవ్, ఘన్శ్యామ్ మౌర్యాలే తన కూతురిని హత్యచేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు.
అయితే గతంలో తమ కూతురిని వీరి అపహరించడానికి ప్రయత్నించగా వారి చర్యలకు తాను అడ్డు పడ్డానని అందుకే కసితో మరోసారి తన కూతురుని తీసుకు వెళ్లి అన్యాయంగా అత్యాచారం చేసి చంపారని గుండెలు బద్దలు కొట్టుకున్నాడు. అయితే పాప తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోని నలుగురు కానిస్టేబుళ్ళను అధికారులు విధులనుంచి తొలగించారు. పోలీసులు సర్వజీత్, ఇమ్రాన్లను అరెస్టు చేశారు. ఘనశ్యామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.