ప్రవంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బ్రెగ్జిట్ ఫలితాలు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను పదవి నుంచి దించేలా చేశాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న విషయంపై బ్రిటన్ ప్రజలంతా నిన్న బారులు తీరి మరీ ఓటేశారు. నేటి ఉదయం వెలువడ్డ ఫలితాల్లో ప్రధాని డేవిడ్ కామెరాన్ అభిప్రాయానికి భిన్నంగా ప్రజలు ఓటేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకే ఆ దేశ ప్రజలు సుముఖత చూపారు. దీంతో ఫలితాలు వెలువడ్డ వెంటనే కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన ప్రకటన చేశారు.
బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆయన భార్య సమంతాతో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతం యూరోప్లో బ్రిటన్ పాత్రపై చర్చలు జరిపేందుకు బలమైన విశ్వసనీయమైన నాయకత్వం అవసరం. నేను బ్రిటన్ ప్రధానిని అయినందుకు గర్విస్తున్నాను.. నేను ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నాను.. వచ్చే మూడునెలల పాటు ఈ పదవిలో కొనసాగుతా. అక్టోబర్లో జరిగే కన్జర్వేటివ్ పార్టీ సమావేశంలో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు. నా అభిప్రాయానికి భిన్నంగా బ్రిటన్ ప్రజలు తీర్పునిచ్చారు.. ఇప్పుడు ఇంకా నేను బ్రిటన్ నాయకుడిగా ఉండటం సరికాదు’ అని కామెరాన్ పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ ను కొనసాగించేందుకు తన శాయశక్తులా యత్నించానని చెప్పిన ఆయన... అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశాన్ని నడిపించే బాధ్యతలకు స్వస్తి చెప్పేందుకే నిర్ణయించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేక ఫలితాలు సాధించిన తనకు అధికారంలో కొనసాగే అర్హత లేదని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రెగ్జిట్పై జరిగిన రిఫరెండంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడంవైపే బ్రిటిష్ ప్రజలు మొగ్గుచూపారు. రిఫరెండానికి ముందు బ్రెగ్జిట్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని కామెరాన్ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.