బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి.. కేంద్రంలోని సీనియర్ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పెద్దలకు చికాగు పుట్టిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు స్వామి పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ కూడా స్వామి వ్యాఖ్యలను సమర్థించదని బీజేపీ నేతలు చెప్పారు. కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లపై స్వామి చేసే వ్యక్తిగత ఆరోపణలను ఆర్ఎస్ఎస్ ఆమోదించదని తెలిపారు.
సుబ్రహ్మణ్య స్వామి తాజాగా విదేశీ పర్యటనలో మన మంత్రులు వేసుకునే దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్పై వరసగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన రూటు మార్చి ఈసారి మంత్రుల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు విదేశీ పర్యటనలో టై, కోట్ ధరించవద్దని భారతీయ సంప్రదాయాన్ని చాటే దుస్తులు మాత్రమే ధరించాలని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
క్రమశిక్షణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. ‘కొందరు అడగకుండానే సలహాలిస్తున్నారు. నేను ఒకవేళ క్రమ శిక్షణను ఉల్లంఘించి ఉంటే పర్యవసానాలు మరోలా ఉండేవన్న సంగతి వారికి తెలియదు’ అని జైట్లీ పేరును ప్రస్తావిం చకుండా ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్లను స్వామి విమర్శించడం తెలిసిందే. దీంతో క్రమశిక్షణతో, విచక్షణ కోల్పోకుండా ప్రవర్తించాలని స్వామికి జైట్లీ సూచించారు. దీనిపై స్వామి ట్విటర్లో స్పందించారు.
బీజేపీ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంత్రులు మన సంప్రదాయ దుస్తుల్లో కాకుండా విదేశీ దుస్తుల్లో కనిపిస్తే వారు వెయిటర్లలా ఉంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. స్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో బీజేపీ పెద్దలకు కోపం తెప్పించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.