అమరావతిలో కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ‘ఎన్టీఆర్ అన్న క్యాంటీన్’ ప్రారంభం అయింది. తాత్కాలిక సచివాలయంలో భోజనశాల ఏర్పాటు చేశారు. కేవలం ఐదు రూపాయలకే ఉప్మా, పెరుగన్నం, పొంగల్, పులిహోర ఏదైనా ఒక్క ప్లేట్ అందించారు. డు ఇడ్లీల ధర 3 రూపాయలు. సాంబారు అన్నాన్ని కేవలం 7 రూపాయలకే అందించనున్నారు. ఇక రెండు చపాతీలు రూ.4 మాత్రమే. ఎన్టీఆర్ క్యాంటీన్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, మళ్లీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భోజనాన్ని తక్కువ ధరకే అందించనున్నారు.
క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు నాయుడు అక్కడి భోజనాన్ని స్వయంగా ప్రజలకు వడ్డించారు. తాను ప్రారంభించిన క్యాంటీన్లో తానే స్వయంగా భోజనం వడ్డించుకొని దాని రుచి చూశారు. చంద్రబాబుతో పాటు హోం మంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్ సైతం అల్పాహారం రుచిచూశారు. ఆహార నాణ్యతను పరిశీలించారు.
పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ను ప్రారంభింభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఐదు రాపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. పేదవాడిని ఆదుకునేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన క్యాంటీన్ ద్వారా రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల మందికి తక్కువ ధరకే భోజనం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన అక్కడి తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.