చంద్రబాబు ఏదైనా బహిరంగ సభలో మాట్లాడాల్సి వస్తే.. ఏపీ ఎదుర్కొన్న విభజన కష్టాల నుంచి మొదలుపెడతారు. అష్టకష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తాను కష్టపడి గట్టున పడేస్తున్నాని చెబుతుంటారు. రాష్ట్రానికి తాను పెద్ద కూలీనని.. ముఖ్యమంత్రిని కాదని తరచూ అంటుంటారు. ప్రజాసేవ తప్ప తనకు వేరే వ్యాపకాలు లేవంటారు.
అంతవరకూ ఓకే.. కానీ చంద్రబాబు విదేశీయాత్రలు ఎందుకు అంతగా చేస్తున్నారు. ఓ ప్రధాని కంటే ఎక్కువగా ఎందుకు విదేశాల్లో గడుపుతున్నారు.. ఈ ప్రశ్నలకు టీడీపీ దగ్గర సమాధానం రెడీగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు.. పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు కష్టపడిపోతున్నారని సెలవిస్తారు.
విదేశీ పర్యటనలో చంద్రబాబు మోడీతో పోటీపడుతున్నారని విమర్శిస్తున్న వైసీపీకి ఇప్ప్పుడు చంద్రబాబు ఫారిన్ టూర్ మీద సందేహాలు మొదలయ్యాయి. నెంబర్ వన్ కూలీనని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వందల కోట్లు ఖర్చుపెడుతూ, ప్రత్యేక విమానాల్లో విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు. వెళ్తున్న ప్రతిసారీ ఎందుకు డజన్ల కొద్దీ సూట్ కేసులు తీసుకెళ్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది.
చంద్రబాబు అసలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారా..? లేక ఏపీలో దోచుకుంది దాచుకోవడానికి వెళ్తున్నారా అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు సందేహం వెలిబుచ్చారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు దేశం పరువు మంటగలుపుతున్నారని అంబటి విమర్శిస్తున్నారు.