రాష్ట్ర విభజన పూర్తయి రెండేళ్లవుతున్నప్పటికీ హైకోర్టు విభజన జరగలేదని నిజామాబాద్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. న్యాయమూర్తులకు ఆప్షన్ల విధానాన్ని రద్దు చేయాలన్నది తమ డిమాండని, వారికి నిన్న జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలని అన్నారు. కోర్టుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి న్యాయమూర్తుల నియామకం వరకూ వివాదాలు వస్తున్నాయని గుర్తు చేశారు. దీనిపై టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ బుధవారం సమావేశమవుతుందని కవిత తెలిపారు.
హైకోర్టు విభజనపై, న్యాయవాదుల ఆందోళన అంశంపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టుకు బిల్డింగ్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందని ఆమె అన్నారు. అయినా విభజన జరగడం లేదని, దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం వద్ద చేస్తోన్న రాజకీయాలేనని ఆమె ఆరోపించారు.
హైకోర్టు విభజన, జడ్జిల ఆప్షన్ల విధానం అంశాలపై ఏదో కుట్ర దాగి ఉందని కవిత సందేహం వ్యక్తం చేశారు. ఆప్షన్ల విధానం అన్యాయమని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజన అంశంలో రాజకీయాలు చేయొద్దని అన్నారు. మల్లన్నసాగర్ పై రాద్ధాంతం చేస్తోన్న కాంగ్రెస్ నేతలు న్యాయవాదుల ఆందోళనపై ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.
కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అత్యంత ఆవేదనతోనే తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని భావిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనపై కేంద్రంతో, ప్రధాని మోదీతో కేసీఆర్ ఎన్నోమార్లు చర్చించినా ఫలితం లేకపోయిందని అన్నారు. అంతా కేంద్రం పరిధిలోనే విభజన జరగాల్సి వుందని గుర్తు చేసిన ఆమె, మోదీ సర్కారు వైఖరి పట్ల కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని అమె అన్నారు.