ఓ హత్య కేసులో రామచిలుక సాక్ష్యంగా మారిన ఘటన అమెరికాలోని మిచిగన్లో చోటుచేసుకుంది. కేసును విచారిస్తున్న పోలీసులు ఆ రామచిలుక పలుకుతున్న మాటలు చూసి నిర్ఘాంతపోతున్నారు. అమెరికాలోని మిచిగన్లో ఓ హత్య కేసులో రామచిలుక సాక్షిగా నిలిచిలింది. చిలుక సాక్ష్యంతో కేసును ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. మిచిగన్లోని సాండ్లేక్ పట్టణంలో గత ఏడాది మేలో భర్త మార్టిన్ను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెనా డురమ్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు బుల్లెట్ గాయాలతో వారి నివాసంలో పడి ఉన్న భర్త మార్టిన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గ్లెనా డురమ్ తలకు కూడా బుల్లెట్ గాయమైంది.
భర్త పక్కనే తలకు బుల్లెట్ గాయంతో గ్లెన్న కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత వారి ఇంట్లో పెంచుకుంటున్న ఓ చిలుక ఆ దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవ గురించి చిన్న చిన్న మాటలతో అరవడం ప్రారంభించింది. ‘ఇంట్లోంచి వెళ్లిపో..’, ‘ఎక్కడికి వెళ్లాలి..’ ‘నన్ను కాల్చొద్దు..’ అనే పదాలను చిలుక పొడిపొడిగా చెబుతుండటాన్ని విచారణాధికారులు గమనించారు.
చిలుక మాటలను అధ్యయనం చేస్తున్నామని.. హత్య కేసులో చిలుక సాక్ష్యంను కోర్టు అనుమతిస్తుందా? లేదా? అనేది నిర్ధారించాల్సి ఉందని న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. అయితే మరోవైపు తన భర్తను హత్య చేయలేదని గ్లెనా డురమ్ వాదిస్తోంది.